ఏపీలో కూరగాయల రవాణాకు అనుమతి

అమరావతి: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ఊరట లభించింది. ఈ పంటల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి ఆటంకం కలుగకుండా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. (లాక్డౌన్వైరస్ కంటే మరింత ప్రమాదకరం!)




లాక్‌డౌన్‌ నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ రవాణాలో చాలా చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌధురి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉద్యాన పంటల రవాణా, ఎగుమతి, శుద్ధి, సేకరణ, రైతు బజార్లకు, స్థానిక మార్కెట్లకు తరలింపు వంటి వాటికి గతంలో మినహాయింపు ఇచ్చినా సక్రమంగా అమలు కావడంలేదని, మరోసారి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తూ ఈ మినహాయింపులు అమలయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆమోదం తెలిపాయి. దీంతో జిల్లాలలో వ్యవసాయ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ చిరంజీవి చౌధురి జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. (కరోనాతో యుద్ధం : ప్రభుత్వానికి సహకరించండి)